•న్యూ ఇయర్ వేడుకలపై కఠిన ఆంక్షలు
మునిపల్లి,డిసెంబర్30(మనప్రజాప్రతినిధి)
డిసెంబర్ 31 న్యూ ఇయర్ సందర్భంగా మునిపల్లి పరిధిలో శాంతిభద్రతలు కాపాడేందుకు కఠిన చర్యలు అమలు చేస్తామని మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ హెచ్చరించారు.డిసెంబర్ 31 రాత్రి ఆర్గనైజ్డ్ కార్యక్రమాలకు పోలీసు అనుమతి లేదని స్పష్టం చేశారు. న్యూ ఇయర్ వేడుకలను ప్రజలు తమ ఇండ్లలో కుటుంబసభ్యులతోనే జరుపుకోవాలని సూచించారు. టపాసులు, డీజేలు పూర్తిగా నిషేధించ బడ్డాయని తెలిపారు.మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరమని, వేగంగా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. రహదారులను బ్లాక్ చేసి వేడుకలు నిర్వహించడం నిషిద్ధమని స్పష్టం చేశారు.ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్లు తొలగించి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెట్టిన వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా నిషేధిత డ్రగ్స్, గంజా వంటి మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగం చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు.
మైనర్లకు వాహనాలు ఇవ్వవద్దని, నిబంధనలు అతిక్రమించిన వారిపై ఎలాంటి సడలింపులు ఉండవని స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో డయల్ 100కు ఫోన్ చేసి పోలీసు సేవలను వినియోగించుకోవాలని సూచించారు.
నిబంధనలు అతిక్రమిస్తే కేసులు తప్పవు-మునిపల్లి ఎస్సై రాజేష్ నాయక్ హెచ్చరిక
RELATED ARTICLES

