•రూల్స్ అతిక్రమిస్తే కేసులు తప్పవు-సదాశివపేట సీఐ డి. వెంకటేష్ హెచ్చరిక
మనప్రజాప్రతినిధి//సదాశివపేట.డిసెంబర్30
నూతన సంవత్సరం సందర్భంగా డిసెంబర్ 31 రాత్రి మద్యం సేవించి వాహనాలు నడపవద్దని, రోడ్లపై గందరగోళం సృష్టించవద్దని సదాశివపేట సీఐ డి. వెంకటేష్ ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు. “తస్మాత్ జాగ్రత్త – రూల్స్ అతిక్రమిస్తే కేసులు తప్పవు” అని ఆయన స్పష్టం చేశారు.ముఖ్యంగా యువత మద్యం సేవించి రోడ్లపైకి వచ్చి ఇతరులకు ఇబ్బందులు కలిగించే విధంగా ప్రవర్తించకూడదని సూచించారు. తాగి వాహనాలు నడపడం, రోడ్లపై హంగామా చేయడం, ప్రజలకు అసౌకర్యం కలిగించడం వంటి చర్యలపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని తెలిపారు.చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై తప్పనిసరిగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి సడలింపులు ఉండవని సీఐ వెంకటేష్ హెచ్చరించారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొంటూ, నూతన సంవత్సరాన్ని శాంతియుతంగా, ఆనందంగా జరుపుకోవాలని, కుటుంబ సభ్యులతో సురక్షితంగా వేడుకలు నిర్వహించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో పోలీస్ శాఖ తరఫున ప్రత్యేక గస్తీ, వాహన తనిఖీలు మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ చెక్పోస్టులు ఏర్పాటు చేయనున్నట్లు సీఐ వెల్లడించారు.

