•మాఘఅమావాస్య సందర్భంగా కన్నుల పండువగా నిర్వహించిన కళ్యాణ మహోత్సవం.
•భక్తులు భారీగా పాల్గొన్న శ్రీ ఎల్లమ్మ ఆలయ కళ్యాణ వేడుకలు…
•అమ్మవారి ఆశీస్సులతో ప్రజలకు శుభఫలితాలు కలగాలని ఆకాంక్ష..
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి18
మాఘ అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని రాజన్న సిరిసిల్ల పట్టణం 12వ వార్డు పరిధిలోని చంద్రంపేటలో వెలసిన శ్రీ ఎల్లమ్మ (శ్రీ రేణుకా మాత) ఆలయ ప్రాంగణంలో శ్రీ రేణుకా మాత-జమదగ్నిల కళ్యాణ మహోత్సవాన్ని ఆదివారం కన్నుల పండువగానిర్వహించారు.
భక్తిశ్రద్ధల మధ్య నిర్వహించిన ఈ కళ్యాణ మహోత్సవంలో స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల నడుమ అర్చకులు శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతువును నిర్వహించగా, ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక శోభతో మార్మోగింది.
ఈ కార్యక్రమానికి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సూర దేవరాజు,12వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి సూర నిర్మల హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని, అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో వార్డు ప్రముఖులు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ పరిసరాలు భక్తుల కోలాహలంతో, భక్తి వాతావరణంతో నిండిపోయాయి. అమ్మవారి కృపతో పట్టణ ప్రజలందరికీ శుభఫలితాలు కలగాలని భక్తులు ప్రార్థించారు.

