•సమర్థ గ్రామ పాలన దిశగా అడుగు-ఐదు రోజుల శిక్షణ పూర్తి చేసిన జక్కన్నపేట్ సర్పంచి
•శిక్షణ తరగతుల్లో జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సర్టిఫికెట్ అందుకున్న జక్కన్నపేట్ గ్రామ సర్పంచి చామంతుల సత్యనారాయణ
మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి.జనవరి23,
నూతనంగా ఎన్నికైన సర్పంచుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల 19 నుంచి 23 వరకు ఐదు రోజుల పాటు శిక్షణ తరగతుల శిబిరాన్ని మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించారు.ఈ శిక్షణ శిబిరానికి జక్కన్నపేట్ గ్రామ సర్పంచి చామంతుల సత్యనారాయణ క్రమం తప్పకుండా హాజరై, పంచాయతీ రాజ్ శాఖ జిల్లా అధికారుల ద్వారా గ్రామాభివృద్ధికి సంబంధించిన కీలక అంశాలపై సమగ్ర అవగాహన పొందారు.శిక్షణలో భాగంగా గ్రామాభివృద్ధి ప్రణాళికలు, పారిశుద్ధ్య కార్యక్రమాల అమలు, నిరక్షరాస్యత నిర్మూలన, అక్షరాస్యత వృద్ధి, పేదరిక నిర్మూలన, ప్రభుత్వ సంక్షేమ పథకాల సమర్థవంతమైన అమలు, గ్రామంలో అన్ని వర్గాల ప్రజలకు సమాన అవకాశాలు కల్పించడం, మౌలిక వసతుల అభివృద్ధి వంటి అంశాలను అధికారులు సవివరంగా వివరించారు.శుక్రవారం రోజున శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ చేతుల మీదుగా సర్పంచి చామంతుల సత్యనారాయణ సర్టిఫికెట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,“ఈ శిక్షణ తరగతుల ద్వారా ఇప్పటివరకు తెలియని అనేక విషయాలు తెలుసుకునే అవకాశం లభించింది. వివిధ గ్రామాల సర్పంచులు తమ అనుభవాలను పంచుకోవడం ఎంతో ఉపయుక్తంగా నిలిచింది” అని తెలిపారు.

