•భారీ భక్తుల రద్దీకి ముందస్తు చర్యలు…కట్టుదిట్టమైన బందోబస్తు
•చక్రస్నానం, వాహన సేవలపై ప్రత్యేక దృష్టి
•ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక ప్రణాళిక
•పోలీస్–టీటీడీ–ఆక్టోపస్ సమన్వయంతో భద్రతా ఏర్పాట్లు
•ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ ద్వారా పర్యవేక్షణ.
•భక్తుల భద్రతే లక్ష్యం-ట్రాఫిక్, బందోబస్తుపై ఎస్పీ సమీక్ష
మనప్రజాప్రతినిధి//తిరుపతి జిల్లా.జనవరి24
తిరుమల శ్రీవారి రథసప్తమి వేడుకల సందర్భంగా భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, వివిధ విభాగాల మధ్య సమన్వయ చర్యలపై జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్., టీటీడీ సీవీ & ఎస్ఓ శ్రీ మురళీకృష్ణ ఐపీఎస్.తో కలిసి జిల్లా పోలీస్ కార్యాలయ సమావేశ మందిరంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలీస్ శాఖ, టీటీడీ విజిలెన్స్, ఆక్టోపస్ తదితర విభాగాల అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు ఐపీఎస్. మాట్లాడుతూ, రథసప్తమి నాడు శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో నిర్వహించే అన్ని వాహన సేవలు ఒక్కరోజే అత్యంత వైభవంగా జరుగుతాయని తెలిపారు. ఈ నేపథ్యంలో తిరుమలలో భారీగా భక్తుల రద్దీ ఏర్పడే అవకాశం ఉన్నందున ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.ముఖ్యంగా చక్రస్నానం సందర్భంగా కోనేరు ప్రాంతంలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేసి భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. అలాగే భక్తుల రాకపోకలు సజావుగా జరిగేలా ఎంట్రీ–ఎగ్జిట్ మార్గాలను సమర్థవంతంగా నిర్వహించాలని తెలిపారు.ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ రూమ్ వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటు చేసి అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. రథసప్తమి సందర్భంగా తిరుమలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడడమే పోలీస్ శాఖ ప్రధాన బాధ్యత అని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు.

