_స్వాధీనం చేసుకున్న బంగారు, వెండి వస్తువులు
_రేణిగుంట సబ్రిజిస్ట్రార్ ఆఫీసు ఉద్యోగి తిరుమలేశ్ అరెస్టు
_నెల్లూరు జిల్లా దగదర్తి తహశీల్దారు పాల కృష్ణ ఇళ్లలో సోదాలు
_పాల కృష్ణ నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో ఏసీబీ తనిఖీలు
మనప్రజాప్రతినిధి//(మీజూరు మల్లి) జనవరి 30:
ఆదాయానికి మించి ఆస్తులకు సంబంధించిన ఫిర్యాదులపై రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ ప్రత్యేక దృష్టి సారించింది. అవినీతికి పాల్పడే వ్యక్తులు, సంస్థలపై నిరంతరం నిఘా ఉంచడమే తమ ప్రధాన లక్ష్యమని ఏసీబీ డైరెక్టర్ జనరల్ అతుల్ సింగ్ గతేడాది కేసుల సమీక్ష అనంతరం వెల్లడించారు. దానికి తగినట్లుగానే 2026 ప్రారంభం నుంచి తమకు వచ్చిన ఫిర్యాదులను నిశితంగా పరిశీలిస్తోంది.
గురువారం రెండు చోట్ల ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు నమోదు చేసిన ఏసీబీ శుక్రవారం తెల్లవారుజాము నుంచి క్షేత్రస్థాయిలో తనిఖీలు జరుపుతోంది. నెల్లూరు జిల్లా దగదర్తి తహశీల్దారు పాల కృష్ణ ఇళ్లలో ఓ బృందం సోదాలు నిర్వహిస్తోంది. నెల్లూరు జిల్లాలోని పాల కృష్ణ నివాసంతో పాటు బంధువులు, ఇతరులకు చెందిన 8 ప్రాంతాల్లో తనిఖీలు జరుపుతున్నారు.
నగదు, బంగారం, వెండి ఆభరణాలతో పాటు పలు డాక్యుమెంట్లను గుర్తించినట్లు సమాచారం. మరో ఫిర్యాదుపై న్యాయశాఖకు చెందిన ఉద్యోగుల ఇళ్లలోనూ సోదాలు చేస్తున్నారు. గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లోని 5 చోట్ల తనిఖీలు చేస్తున్నట్లు ఏసీబీ ప్రధాన కార్యాలయం పేర్కొంది. తాజా సోదాలకు సంబంధించి మధ్యాహ్నం తర్వాత స్పష్టమైన వివరాలు బయటకొచ్చే అవకాశం ఉంది.*
తిరుపతి జిల్లా రేణిగుంటలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేస్తూ సస్పెన్షన్కు గురైన ఆఫీస్ సబార్డినేట్ తిరుమలేశ్ ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్లు అవినీతి నిరోధక శాఖ గుర్తించింది. ఈ మేరకు ఏసీబీ అదనపు ఎస్పీ విమలకుమారి పర్యవేక్షణలో 3 బృందాలు తిరుపతి, నెల్లూరులోని 6 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించాయి.రేణిగుంట సబ్రిజిస్ట్రార్ ఆఫీసు ఉద్యోగి తిరుమలేశ్ అరెస్టు : తిరుపతి రామచంద్రనగర్లోని శ్రీలక్ష్మీ నివాస్ అపార్ట్మెంట్లో తిరుమలేశ్ సమక్షంలో ఓ బృందం తనిఖీలు చేసింది. చైతన్యపురంలో జీ ప్లస్ త్రీ భవనం, తిరుచానూరు పరిధిలో 2 స్థలాలతో పాటు మరో 2 ఆస్తుల పత్రాలను గుర్తించారు. నివాసం ఉంటున్న అపార్ట్మెంట్తో పాటు భూములు, భవనాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడ రూ.15.26 లక్షల నగదు, కిలో 400 గ్రాముల బంగారు, 8 కిలోల 700 గ్రాముల వెండి సామగ్రిని గుర్తించారు. కారు, 3 ద్విచక్ర వాహనాలు, విలువైన గృహోపకరణాలు సోదాల్లో బయటపడ్డాయి.రెండు బ్యాంకు లాకర్లలో నగదు, ఆభరణాలను మదింపు చేయనున్నారు. తిమ్మినాయుడుపాళెంలోని అతని సన్నిహితుల అపార్ట్మెంట్లోనూ సోదాలు జరిపారు. అక్కడ కిలో బంగారు ఆభరణాలు, 4 కిలోల వెండి సామగ్రి గుర్తించారు. నగరంలోని గిరిపురంలోని సొంతింటితో పాటు మరో ఇంటిలోనూ నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని డీసీపల్లిలోని రెండు ప్రాంతాల్లోనూ తనిఖీలు చేశారు. అక్కడ నిర్మాణంలో ఉన్న జీ ప్లస్ త్రీ భవనానికి సంబంధించిన పత్రాలను గుర్తించారు. ఈ ఆస్తుల విలువ సుమారు రూ.50 కోట్లు ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేశారు. సంబంధిత పత్రాలు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. తిరుమలేశ్ను అరెస్టు చేసిన అధికారులు నేడు ఏసీబీ కోర్టుకు తరలించనున్నారు.

