– పశువైద్యశాలకు ఆధునీకరణకు ఆమోదం
– మత్స్యకారులతో సమావేశం – సమస్యల వివరాలు సేకరణ
– త్వరలో అత్యాధునిక మోడర్న్ ఫిష్ మార్కెట్ ఏర్పాటు
(హుస్నాబాద్, నవంబర్ 15) (మనప్రజాప్రతినిధి):
హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన పర్యటనలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఫిషరీస్ కార్పొరేషన్ అధికారి మెట్టు సాయితో కలిసి పశువైద్యశాలను పరిశీలించారు. హుస్నాబాద్ ప్రాంతంలో పశు సంపద అధికంగా ఉండటంతో, రైతులకు మెరుగైన వైద్య సేవలు అందించాల్సిన అవసరాన్ని మంత్రి ప్రస్తావించారు. పశువైద్యశాలను ఆధునీకరించి అభివృద్ధి చేయాలని స్థానిక ప్రజలు కోరగా, వారి అభ్యర్థనను మంత్రి సానుకూలంగా స్వీకరించారు.
పరిశీలన అనంతరం పశువైద్యశాలలో మౌలిక సదుపాయాలను అంచనా వేసిన మంత్రి పొన్నం ప్రభాకర్, అవసరమైన పరికరాలు, సిబ్బంది, అత్యవసర సేవలను త్వరగా అందుబాటులోకి తేవడానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రైతులకు సమయానుకూలంగా సేవలు అందడంలో ఈ ఆధునీకరణ పెద్ద పాత్ర వహిస్తుందని పేర్కొన్నారు.తరువాత స్థానిక ఫిష్ మార్కెట్ను మంత్రి పరిశీలించారు. మత్స్యకారులతో ప్రత్యక్షంగా మాట్లాడి వారి వ్యాపార లావాదేవీలు, ప్రస్తుత సదుపాయాలు, మార్కెట్లో ఉన్న సమస్యలను ఆరా తీశారు. నిల్వ సదుపాయాలు, పరిశుభ్రత, ధరల నియంత్రణ వంటి అంశాలపై మత్స్యకారుల అభిప్రాయాలు తెలుసుకున్నారు.
హుస్నాబాద్ పట్టణంలో త్వరలోనే అత్యాధునిక మోడర్న్ ఫిష్ మార్కెట్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు. ఆధునిక సదుపాయాలతో కూడిన ఈ మార్కెట్ ఏర్పాటైతే మత్స్యకారుల ఆదాయం పెరగడంతో పాటు ప్రజలకు మెరుగైన నాణ్యత గల చేపలు అందుబాటులో ఉంటాయని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
హుస్నాబాద్లో అభివృద్ధి పనులు వేగవంతం – మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటన
RELATED ARTICLES

