°లావణ్య గార్డెన్ సమీపంలోని డివైడర్ను ఢీకొన్న కారు –పండుగకు వెళ్లి తిరిగి వస్తుండగా విషాదం
°ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో తండ్రి, కుమారుడు మృతి
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.జూన్28
సిద్దిపేట జిల్లా రూరల్ మండల పరిధిలోని ఇరుకోడు గ్రామ శివారులో ఆదివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని లావణ్య గార్డెన్ సమీపంలో కారు AP29BH9486 అదుపుతప్పి డివైడర్ను బలంగా ఢీకొనడంతో తండ్రి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు.
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మిరుదొడ్డి మండలం మల్లుపల్లి గ్రామానికి చెందిన స్వామి రజక తన కుటుంబ సభ్యులతో కలిసి కారులో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో స్వామితో పాటు అతని ఆరేళ్ల కుమారుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం.
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కారు పూర్తిగా ధ్వంసం కావడంతో జేసీబీ సహాయంతో కారులో చిక్కుకున్న వారిని బయటకు తీశారు. ఈ సహాయక చర్యలను రూరల్ ఎస్సై జి. నవత పర్యవేక్షించారు. అనంతరం మృతదేహాలను అంబులెన్స్ ద్వారా స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు.
మృతులు అప్పనపల్లి గ్రామంలో నిర్వహించిన దుర్గమ్మ పండుగకు హాజరై తిరిగి సిద్దిపేటకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.
ఈ విషాద ఘటనతో మల్లుపల్లి గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


