ఏపీ గ్రీన్ కమిటీ చైర్మన్గా నియామకం
కేబినెట్ హోదాతో అధికారిక ఉత్తర్వులు
పర్యావరణ పరిరక్షణపై ప్రత్యేక దృష్టి
రాష్ట్రవ్యాప్తంగా పచ్చదనం పెంపే లక్ష్యం…
అమరావతి,ఆగస్టు17(మనప్రజాప్రతినిధి):ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. జనసేన ఎమ్మెల్సీ, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సోదరుడు కొణిదెల నాగబాబును ఏపీ గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్గా నియమించింది. ఈ మేరకు రాష్ట్ర పర్యావరణ, అటవీశాఖ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. నాగబాబుకు కేబినెట్ హోదా కూడా కల్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రంలో పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం విస్తరణ, అటవీ సంపద అభివృద్ధి లక్ష్యంగా పనిచేసే గ్రీన్ కార్యనిర్వాహక కమిటీకి నాగబాబు నాయకత్వం వహించనున్నారు. ప్రభుత్వ పర్యావరణ విధానాల అమలులో కమిటీ కీలక పాత్ర పోషించనుంది.
రాష్ట్రవ్యాప్తంగా మొక్కల పెంపకం, అటవీ విస్తరణ, పర్యావరణ సమతుల్యత పరిరక్షణకు సంబంధించిన కార్యక్రమాలను పర్యవేక్షించడం కమిటీ ప్రధాన బాధ్యతగా ఉండనుంది. వివిధ శాఖల సమన్వయంతో చేపట్టే హరిత కార్యక్రమాల అమలును కూడా కమిటీ పరిశీలించనుంది. నాగబాబు సారథ్యంలో కమిటీ రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తూ పచ్చదనం పెంపొందించే కార్యక్రమాల పురోగతిని సమీక్షించనుంది. భారీ స్థాయిలో చేపట్టే మొక్కల నాటే కార్యక్రమాలు, పర్యావరణ పరిరక్షణ ప్రాజెక్టుల అమలుపై ప్రత్యేక దృష్టి సారించనుంది.
పర్యావరణానికి మేలు చేసే కొత్త కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యంతో చేపట్టే హరిత కార్యక్రమాల రూపకల్పనలో కమిటీ కీలక సూచనలు చేయనుంది. వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించే చర్యలపై కూడా కమిటీ దృష్టి కేంద్రీకరించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. పచ్చని ఆంధ్రప్రదేశ్ నిర్మాణ లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు గ్రీన్ కార్యనిర్వాహక కమిటీ బలమైన వేదికగా నిలవనుంది. పర్యావరణ పరిరక్షణ, హరితాభివృద్ధి, అటవీ విస్తరణ వంటి అంశాల్లో కమిటీ చురుకైన పాత్ర పోషిస్తుందని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.


