📄 ePaper
Sunday, July 26, 2026
Homeఆంధ్రప్రదేశ్వేడాం రోడ్డు కాదు… వరి పొలం!

వేడాం రోడ్డు కాదు… వరి పొలం!

📰 Generate e-Paper Clip

పాలకుల నిర్లక్ష్యానికి కాంగ్రెస్ నేతల ఉగ్ర నిరసన
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తినియోజకవర్గం.డిసెంబర్20
శ్రీకాళహస్తి మండలంలోని వేడాం రోడ్డు పాలకులు, అధికారుల ఘోర వైఫల్యానికి నిదర్శనంగా మారింది. వ్యవసాయ తూములను అక్రమంగా ఆక్రమించి రహదారిని పూర్తిగా నాశనం చేయడంతో నేటికీ ఈ మార్గం గుండా వాహనాలు వెళ్లలేని పరిస్థితి నెలకొంది. పట్టణానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ కీలక రహదారి పూర్తిగా జలమయమై వరి పొలంలా మారింది.ఈ పరిస్థితిపై మండిపడ్డ కాంగ్రెస్ పార్టీ నేతలు రోడ్డుపై వరి నాట్లు నాటి, చేపలు పట్టుతూ ఉగ్ర నిరసన చేపట్టారు. “ఇది రోడ్డు కాదు… పాలకుల నిర్లక్ష్యానికి సాక్ష్యంగా మారిన పొలం” అంటూ నినాదాలు చేస్తూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఈ సందర్భంగా డిసిసి అధ్యక్షులు బాలగురవం బాబు మాట్లాడుతూ, రోజూ వేలాదిమంది కూలీలు, రైతులు, వ్యాపారులు, అత్యవసర రోగులు ఈ మార్గం గుండా ప్రయాణిస్తారని అన్నారు. పాలకులు, అధికారులు కనీసం రోడ్డును చూడటానికి కూడా రావడం లేదని తీవ్రంగా విమర్శించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ నియోజకవర్గ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ, శ్రీకాళహస్తి దేవస్థానానికి వచ్చే భక్తులు, వెయ్యలింగాలకోన, భైరవకోన, దక్షిణ కాళికాదేవి ఆలయాలకు వెళ్లే వేలాది మంది ఈ రహదారి గుండా ప్రయాణిస్తున్నారని గుర్తు చేశారు. ఈ రహదారి నేడు ప్రమాదాలకు నిలయంగా, నరకప్రాయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ రోడ్డును శాశ్వతంగా నిర్మించకపోతే మరింత ఉగ్ర ఉద్యమాలు తప్పవని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, రేణిగుంట మండల అధ్యక్షులు రాహుల్ రాయల్, శ్రీకాళహస్తి మండల యువజన అధ్యక్షులు నవీన్, రేణిగుంట మండల యువజన అధ్యక్షులు ఆసిఫ్, అలాగే కళ్యాణ్, నాగరాజు, అల్లావుద్దీన్, చరణ్, మహాలక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular