📄 ePaper
Monday, July 27, 2026
Homeతెలంగాణబాధితుడికే శిక్ష… నేరస్తుడికి రక్షణ?

బాధితుడికే శిక్ష… నేరస్తుడికి రక్షణ?

📰 Generate e-Paper Clip

చట్టం ఎవరి పక్షాన నిలుస్తోంది?
– న్యాయం ఆలస్యం… అన్యాయం శాశ్వతమా?
– బాధితుడి పోరాటమే శిక్షగా మారుతోందా?

గంజాయి శ్రీనివాస్,జనవరి10(మనప్రజాప్రతినిధి):


నేరం చేసినవాడు శిక్ష అనుభవించాలి… బాధితుడికి న్యాయం జరగాలి. ఇది చట్ట వ్యవస్థ యొక్క మూల సూత్రం. కానీ నేటి పరిస్థితుల్లో ఈ సూత్రం తలకిందులవుతున్నదా? అన్న అనుమానాలు ప్రజల్లో బలపడుతున్నాయి. అనేక సందర్భాల్లో నేరస్తుడు వ్యవస్థ రక్షణలోకి వెళ్లిపోతే… బాధితుడే కోర్టుల చుట్టూ తిరుగుతూ, పోలీస్ స్టేషన్ల మధ్య నలిగిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది కేవలం వ్యక్తిగత సమస్య కాదు… వ్యవస్థ వైఫల్యానికి అద్దం.
న్యాయం కోసం ముందుకొచ్చిన బాధితుడికి ఎదురయ్యేది మానసిక ఒత్తిడి, ఆర్థిక భారం, సామాజిక ఒంటరితనం. ఫిర్యాదు చేసినందుకే బెదిరింపులు, కేసులు, ప్రతీకార చర్యలు ఎదుర్కోవాల్సి వస్తున్నాయి. సాక్ష్యాలు ఉన్నా విచారణ ఆలస్యం, ప్రభావవంతుల జోక్యం, చట్టంలోని చిట్కాలు నేరస్తులకు కవచంగా మారుతున్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఫలితంగా బాధితుడి జీవితమే శిక్షగా మారుతోంది.ఇక నేరస్తుల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంది. రాజకీయ, ఆర్థిక, సామాజిక బలం ఉన్నవారు చట్టాన్ని తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారన్న ఆరోపణలు పెరుగుతున్నాయి. కేసులు నమోదైనా అరెస్టులు ఆలస్యం, చార్జ్‌షీట్లు బలహీనంగా మారడం, సాక్షులు మారిపోవడం వంటి పరిణామాలు న్యాయంపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి. చట్టం అందరికీ సమానమనే మాట కేవలం పుస్తకాల్లోనే మిగులుతోందా? అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.ఈ పరిస్థితుల్లో ప్రజలు అడుగుతున్న ప్రశ్న ఒక్కటేన్యాయం కోసం పోరాడటం తప్పా? బాధితుడే భయపడాల్సిన సమాజం న్యాయసమాజం ఎలా అవుతుంది? చట్ట అమలు సంస్థలు, న్యాయవ్యవస్థ, పాలకులు ఈ ప్రశ్నలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత ఉంది. బాధితుడికి భరోసా, నేరస్తుడికి భయం కలిగే విధంగా వ్యవస్థను బలోపేతం చేయకపోతే… “బాధితుడికే శిక్ష, నేరస్తుడికే రక్షణ” అన్న భావన మరింత లోతుగా పాతుకుపోయే ప్రమాదం ఉంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular