కాలుష్య తీవ్రతతో ప్రభుత్వ అత్యవసర చర్యలు
ప్రైవేట్ కంపెనీలకు కొత్త గైడ్లైన్స్ అమలు
నిరసనల మధ్య పోలీసుల కఠిన చర్యలు
ఢిల్లీ, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రోజు రోజుకు దారుణంగా పడిపోతుండటంతో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా మారింది. చలికాలం ప్రారంభమైన వెంటనే నగరం మళ్లీ గ్యాస్ ఛాంబర్లా మారిపోయిందని పర్యావరణ సంస్థలు హెచ్చరించాయి. PM2.5, PM10 మోతాదులు నిర్ణీత పరిమితిని బాగా దాటి నమోదు కావడంతో ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. పర్యావరణ పరిరక్షణ చట్టం – 1986లోని సెక్షన్ 5 ప్రకారం పర్యావరణ, అటవీ శాఖలు సంయుక్తంగా కీలక ఆదేశాలు జారీ చేశాయి. ఢిల్లీలోని ప్రైవేట్ కంపెనీలు తమ ఉద్యోగుల్లో కనీసం సగం మందికి వర్క్ ఫ్రం హోమ్ ఇవ్వాలని స్పష్టమైన సూచనలు అందాయి. మిగతా సగం మంది మాత్రమే ఆఫీసులకు హాజరయ్యే విధంగా డ్యూటీలను విభజించాల్సిందిగా ప్రభుత్వం కోరింది. 1978 నుంచే కాలుష్య నియంత్రణ ప్రాంతాల్లో ఢిల్లీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉండగా, గత కొన్నేళ్లుగా పరిస్థితి మరింత దిగజారింది. గాలి నాణ్యత నియంత్రణ కమిషన్ సూచనల మేరకు అధికారులు గ్రేడెడ్ యాక్షన్ ప్లాన్ను అమలు చేసినప్పటికీ ఫలితాలు ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. ఈ క్రమంలోనే తాజా వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలు అత్యవసర చర్యల్లో భాగంగా వెలువడ్డాయి. ఇక కాలుష్య నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వేలాది మంది ఇండియా గేట్ వద్ద నిరసనలకు దిగారు. ర్యాలీ ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు జోక్యం చేసుకుని 17 మందిని అదుపులోకి తీసుకున్నారు. నిరసనకారులపై పోలీసులు దాడి చేశారని పలువురు ఆరోపిస్తూ చర్యలు కోరుతున్నారు.
గ్యాస్ ఛాంబర్లా ఢిల్లీ… సగం మంది ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఆదేశాలు
RELATED ARTICLES

