📄 ePaper
Friday, August 28, 2026
Homeజాతియంవడ్డీ రేట్లపై గవర్నర్‌ కీలక సంకేతాలు..

వడ్డీ రేట్లపై గవర్నర్‌ కీలక సంకేతాలు..

📰 Generate e-Paper Clip

ముంబై, నవంబర్‌, 25,మనప్రజాప్రతినిధి:

దేశవ్యాప్తంగా లక్షలాది మంది రుణగ్రహీతలకు త్వరలోనే ఊరట లభించే సూచనలు కనిపిస్తున్నాయి. వడ్డీ రేట్లను మరింత తగ్గించే అవకాశాలు ఉన్నాయని భారత రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా వెల్లడించారు. ఓ ప్రముఖ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ కీలక వ్యాఖ్యలు చేశారు. అక్టోబర్‌లో జరిగిన ద్రవ్య పరపతి విధాన కమిటీ సమావేశంలోనే భవిష్యత్తులో వడ్డీ రేట్ల కోతపై సంకేతాలు ఇచ్చామని, ఆ తర్వాత వెలువడిన ఆర్థిక గణాంకాలు కూడా సానుకూల దిశగా ఉన్నాయని తెలిపారు.
ప్రస్తుతం దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం చరిత్రలోనే కనిష్ట స్థాయికి చేరడమే ఇందుకు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అక్టోబర్ నెలలో ద్రవ్యోల్బణం కేవలం సున్నా పాయింట్ రెండైదు శాతం వద్ద నమోదవడం, ఆహార పదార్థాల ధరలు భారీగా తగ్గడం, వినియోగ వస్తువులపై పన్నుల కోత వంటివి దీనికి దోహదపడ్డాయి.
ఇదే సమయంలో ఈ ఏడాది మొదటి అర్ధభాగంలోనే ద్రవ్య పరపతి కమిటీ మొత్తం వంద ఆధార పాయింట్ల మేర రెపో రేటు తగ్గించిన విషయం తెలిసిందే. ఆగస్టు నుంచి దాన్ని యథాతథంగా కొనసాగిస్తూ వచ్చింది. ప్రస్తుతం రెపో రేటు ఐదు పాయింట్ ఐదు శాతంగా అమలులో ఉంది.
రాబోయే డిసెంబర్‌లో జరిగే కమిటీ సమావేశంలో మరోసారి ఇరవై ఐదు ఆధార పాయింట్ల మేర రేటు తగ్గింపుపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని గవర్నర్ తెలిపారు. అది అమలైతే రెపో రేటు ఐదు పాయింట్ రెండు ఐదు శాతానికి చేరనుంది.
అలా జరిగితే గృహ రుణాలు, వాహన రుణాలు, వినియోగ రుణాలపై ఈఎంఐ భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉంటుంది. దీంతో మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం లభిస్తుందని భావిస్తున్నారు. అయితే, ప్రపంచ మార్కెట్ల పరిస్థితులు, చమురు ధరలు, అంతర్జాతీయ ఆర్థిక పరిణామాలను కూడా దృష్టిలో ఉంచుకుని జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటామని గవర్నర్ స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.