Tuesday, April 14, 2026
ads
Homeతెలంగాణవిద్యార్థుల భద్రతపై కవిత ఆందోళన

విద్యార్థుల భద్రతపై కవిత ఆందోళన

📰 Generate e-Paper Clip


టేకులపల్లిలో మోడల్ స్కూల్ దయనీయ స్థితి
– ప్రమాదకరంగా మారిన హాస్టల్ భవనం
– భోజనంలో పురుగులు – ఆరోగ్యంపై తీవ్ర ముప్పు
– రాష్ట్రవ్యాప్తంగా హాస్టళ్లలో సమస్యలే సమస్యలు
– కల్వకుంట్ల కవిత

ఖమ్మం, నవంబర్ 17 (మనప్రజాప్రతినిధి):
ఖమ్మం జిల్లాలోని టేకులపల్లి మోడల్ స్కూల్ పరిస్థితిని కల్వకుంట్ల కవిత ఆందోళన వ్యక్తం చేశారు. పాఠశాల హాస్టల్ భవనం పూర్తిగా ప్రమాదకర స్థితికి చేరి, విద్యార్థులు అసురక్షిత వాతావరణంలో ఉన్నారని ఆమె తెలిపారు. భవనం పగుళ్లు, పాడైన గోడలు విద్యార్థుల భద్రతను పూర్తిగా ప్రశ్నార్థకంగా మార్చాయని పేర్కొన్నారు. కొద్దిరోజుల క్రితం హాస్టల్ భోజనంలో బొద్దింకలు, పురుగులు ఉండటంతో పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనను కవిత వివరిస్తూ, ప్రభుత్వ నిర్వహణలోని మోడల్ స్కూళ్లు, గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలో ఎంత అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయో సూటిగా వెల్లడించారు. దీనిపై తక్షణ చర్యలు లేకపోవడం ఆందోళనకరమని ఆమె అన్నారు. రాష్ట్రంలో తాను ఏ జిల్లా పర్యటనకు వెళ్లినా అక్కడి హాస్టళ్లలో, స్కూళ్లలో సమస్యలు పెద్ద సంఖ్యలో ఎదురవుతున్నాయని కవిత ఆరోపించారు. ఈ పరిస్థితులు విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో నెడుతున్నాయని, కొన్ని చోట్ల నీరు, మరుగుదొడ్ల వంటి మౌలిక వసతులే అందుబాటులోలేవని ఆమె పేర్కొన్నారు.
సంక్షేమ హాస్టళ్లలో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని కవిత డిమాండ్ చేశారు. విద్యార్థుల భద్రత, ఆరోగ్యం ప్రాధాన్యతగా తీసుకొని, హాస్టళ్లను సురక్షితంగా మార్చే తగిన చర్యలు త్వరితంగా చేపట్టాలని ఆమె స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular