– కాంగ్రెస్ హామీలు నెరవేర్చలేదని మాజీ మంత్రి విమర్శ
– బీసీలకు 42% రిజర్వేషన్ తప్పనిసరి అని స్పష్టం
– బీజేపీ–కాంగ్రెస్ ఇద్దరూ బీసీలను మోసం చేస్తున్నారని ఆరోపణ
హైదరాబాద్, 16 (డిజైనర్ టెక్ గురు ప్రతినిధి):
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేయకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఖమ్మంలో ముగ్గురు మంత్రులు ఉన్నప్పటికీ అక్కడ అభివృద్ధి కనిపించకపోవడం కాంగ్రెస్ వైఫల్యానికి నిదర్శనమని చెప్పారు. కేసీఆర్ హయాంలో అన్ని వర్గాలకూ సమాన న్యాయం జరిగిందని గుర్తుచేస్తూ, బీసీ వర్గాల అభ్యున్నతి బీఆర్ఎస్ ప్రభుత్వ ప్రాముఖ్యత అని వ్యాఖ్యానించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయకుండానే కాంగ్రెస్ స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని చూస్తే రాష్ట్రం అగ్నిగుండంలా మారుతుందని గౌడ్ హెచ్చరించారు. బీసీలు ఈసారి మోసపోవరు, న్యాయం చేసే వరకు ఉద్యమిస్తారని ఆయన అన్నారు. రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలు నిర్వహించడం ప్రజాస్వామ్యాన్ని అవమానించడమేనని తీవ్రంగా విమర్శించారు. బీసీ సమాజం గర్వకారణమయ్యే ఈ డిమాండ్ను ఎవ్వరూ అడ్డుకోలేరని అన్నారు. కాంగ్రెస్ మాత్రమే కాదు, బీజేపీ కూడా బీసీ వర్గాలను మోసం చేస్తోందని గౌడ్ ఆరోపించారు. బీసీ బిల్లు పాస్ అవ్వాలంటే ప్రధాని, రాష్ట్రపతిని కలవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తూ, బీజేపీ నేతలు దీనిపై మౌనం పాటించడం సిగ్గుచేటు అన్నారు. బీజేపీ ఎంపీలు పార్లమెంట్లో ఒత్తిడి తీసుకురాకపోవడంతో బీసీ బిల్లుకు న్యాయం జరగడం లేదని ఆరోపించారు. న్యాయం చేయని పార్టీలకు బీసీ వర్గాలు గట్టి గుణపాఠం చెప్తాయని హెచ్చరించారు.బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్ల విషయంలో పూర్తిగా కట్టుబడి ఉందని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. కులాల ఆధారంగా కాకుండా ఆర్థిక–సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్లు అమలు చేయడమే రాష్ట్రాభివృద్ధికి దారి తీస్తుందని పేర్కొన్నారు. ప్రజల మద్దతుతో బీసీలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఆయన అన్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున బీసీ దిక్సూచీ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
బీసీ రిజర్వేషన్లు అమలు చేయకుండా ఎన్నికలకు వెళ్తే రాష్ట్రం అగ్నిగుండంల మారుతుంది శ్రీనివాస్ గౌడ్ హెచ్చరిక
RELATED ARTICLES

