•వీఐపీ దర్శనాలకు పరిమిత సమయం…శివరాత్రి రోజున సామాన్య భక్తులకే ప్రధాన ప్రాధాన్యం
•మహాశివరాత్రికి భక్తులకే తొలి ప్రాధాన్యం
ఎర్పేడుమండలం,జనవరి20(మనప్రజాప్రతినిధి):
రానున్న మహాశివరాత్రి సందర్భంగా శ్రీ పరశురామేశ్వర స్వామి దేవాలయంలో సామాన్య భక్తులకే మొదటి ప్రాధాన్యత కల్పిస్తూ ఆలయ పాలకమండలి కీలక, చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. దేవస్థానం చైర్మన్ బత్తల నాయుడు అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో శివరాత్రి ఏర్పాట్లపై సుదీర్ఘంగా చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నారు.ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనలతో వీఐపీ దర్శనాలకు పరిమిత సమయాన్ని మాత్రమే కేటాయిస్తూ, ఉదయం 5 గంటల నుంచి 9 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు దర్శన సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. మిగతా సమయమంతా సామాన్య భక్తుల దర్శనానికే కేటాయించ నున్నారు.శివరాత్రి రోజున ఆలయ పరిసరాల్లో వన్వే ట్రాఫిక్ విధానం అమలు చేయనున్నట్లు తెలిపారు. తిరుపతి నుంచి వచ్చే వాహనాలు పాపనాయుడుపేట మార్గం గుండా గుడిమల్లం చేరుకుని దర్శనం అనంతరం చెల్లూరు–సీసీఎల్ మార్గం ద్వారా తిరుపతికి తిరిగి వెళ్లేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ చైర్మన్, కార్యనిర్వహణాధికారి వెల్లడించారు.అదేవిధంగా శివరాత్రి రోజున ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిత్య అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. భక్తులు, వాహనదారులు, ప్రజలందరూ సహకరించి శివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని ఆలయ అధికారులు పిలుపునిచ్చారు. ఈ ఏర్పాట్లకు పోలీసు శాఖ సంపూర్ణ సహకారం అందించనుందని తెలిపారు

