📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణఅసెంబ్లీకి రాని ప్రజాప్రతినిధులపై చర్యలు ఎప్పుడు?

అసెంబ్లీకి రాని ప్రజాప్రతినిధులపై చర్యలు ఎప్పుడు?

📰 Generate e-Paper Clip


– ప్రజాస్వామ్యానికి అద్దంలా ఖాళీ కుర్చీలు
– బాధ్యతలకే బ్రేక్ పడుతోందా?

జనవరి 22 (ప్రజాప్రతినిధి శ్రీనివాస్):

ప్రజాస్వామ్యంలో శాసనసభ అనేది ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం. ఎన్నికల సమయంలో తమ సమస్యలను, ఆశలను ప్రతినిధులుగా సభలో వినిపిస్తారనే నమ్మకంతో ప్రజలు ఓటు హక్కును వినియోగిస్తారు. కానీ ఇటీవలి కాలంలో అసెంబ్లీ సమావేశాలకు ప్రజాప్రతినిధులు హాజరు కాకపోవడం తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది. ప్రజా సమస్యలపై వాదనలు జరగాల్సిన సభల్లో ఖాళీ కుర్చీలు దర్శనమివ్వడం, శాసన వ్యవస్థ పనితీరుపై అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.ప్రజాప్రతినిధి అనేది హోదా కాదు, బాధ్యత. శాసనసభకు హాజరు కావడం వారి ప్రాథమిక కర్తవ్యమే. అయినప్పటికీ రాజకీయ వ్యూహాలు, వ్యక్తిగత లెక్కలు, పార్టీ ఆదేశాలు వంటి కారణాలతో కొందరు సభకు దూరంగా ఉంటున్నారు. ప్రజల సమస్యలు చర్చకు రాకుండా ఉండిపోతే, ప్రజలు తమ ప్రతినిధులపై పెట్టుకున్న విశ్వాసం క్రమంగా క్షీణించే ప్రమాదం ఉంది.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు సభలో ప్రశ్నల రూపంలో, చర్చల రూపంలో వెలువడాల్సి ఉంటుంది. రైతుల సమస్యలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల, విద్యా–వైద్య రంగాల ఇబ్బందులు ఇవన్నీ శాసనసభ వేదికగానే పరిష్కార మార్గం చూడాలి. కానీ సభకు రాకుండా జీతాలు, భత్యాలు పొందడం న్యాయమా అనే ప్రశ్న సామాన్య ప్రజలలో తీవ్రంగా వినిపిస్తోంది. పని చేయకుండా వేతనం పొందే వ్యవస్థ ప్రజాస్వామ్యానికి విరుద్ధమన్న అభిప్రాయం బలపడుతోంది.కొన్ని రాష్ట్రాల్లో ‘నో వర్క్ – నో పే’ విధానం అమలు చేయాలనే చర్చ జరిగినా, అది కఠినంగా అమలవుతున్న దాఖలాలు తక్కువగా కనిపిస్తున్నాయి. చట్టాలు, నిబంధనలు కాగితాలకే పరిమితమైతే, ప్రజలకు న్యాయం జరగదు. శాసనసభలకు గైర్హాజరయ్యే ప్రజాప్రతినిధులపై స్పష్టమైన శిక్షలు, జీత భత్యాల కోత, లేదా ఇతర క్రమశిక్షణ చర్యలు ఉండాలని పలువురు సూచిస్తున్నారు.
అసెంబ్లీ అనేది వ్యక్తిగత రాజకీయాలకు వేదిక కాదు. అది ప్రజల గొంతు వినిపించే అత్యున్నత వేదిక. సభకు రాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం బయట ఉండడం కొనసాగితే, ప్రజాస్వామ్య వ్యవస్థ బలహీనపడే ప్రమాదం ఉంది. ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధులు ప్రజల ముందే జవాబుదారీగా నిలవాల్సిన అవసరం ఉంది.
ఇప్పటికైనా అసెంబ్లీకి రాని ప్రజాప్రతినిధులపై స్పష్టమైన విధానాలు, కఠిన చర్యలు అమలు చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ప్రజల కోసం మాట్లాడాల్సిన చోట ఖాళీ కుర్చీలు కనిపించకుండా చేయడమే నిజమైన ప్రజాస్వామ్యానికి గుర్తు. ప్రజల ప్రశ్న ఒక్కటే అసెంబ్లీకి రాని ప్రజాప్రతినిధులపై చర్యలు ఎప్పుడు?

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.