•ప్రజల ఆకాంక్షలే ప్రాతిపదిక – మున్సిపాలిటీలో కాంగ్రెస్ అభ్యర్థుల వెల్లడి
•పదేళ్ల నిర్లక్ష్య పాలనకు ముగింపు – చేర్యాలలో కాంగ్రెస్ శంఖారావం
•స్వచ్ఛ పాలన, సమగ్ర అభివృద్ధే లక్ష్యం – కాంగ్రెస్ నేతల ప్రకటన
•బీఆర్ఎస్ వైఫల్యాలపై ధ్వజమెత్తిన కాంగ్రెస్ నేతలు
•మున్సిపాలిటీ అభ్యర్థుల జాబితా విడుదల-పారదర్శకతతో ఎంపిక :కొమ్మూరి ప్రతాప్రెడ్డి
మనప్రజాప్రతినిధి//చేర్యాల(జనగామనియోజకవర్గం)ఫిబ్రవరి2
రానున్న మున్సిపాలిటీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చేర్యాల పట్టణంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ శంఖారావం పూరించింది. జనగామ నియోజకవర్గ ఇన్చార్జ్, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్రెడ్డి అధ్యక్షతన చేర్యాలలోని క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ మున్సిపాలిటీ అభ్యర్థుల జాబితాను అధికారికంగా విడుదల చేశారు.ఈ కార్యక్రమంలో భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్కుమార్ రెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, మండల, వార్డుఅధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొమ్మూరి ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ—చేర్యాల మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రజాస్వామ్య స్ఫూర్తితో, పూర్తి పారదర్శకతతో జరిగిందని తెలిపారు. పార్టీ నాయకులు, వార్డు అధ్యక్షులు, స్థానిక ప్రజాప్రతినిధులతో విస్తృత చర్చలు జరిపి, ప్రజల ఆకాంక్షలు, అభివృద్ధి దృక్పథాన్ని ఆధారంగా చేసుకొని అభ్యర్థులను ఎంపిక చేసినట్లు స్పష్టం చేశారు.పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో చేర్యాల పట్టణం అభివృద్ధికి దూరమైందని, మౌలిక వసతులు పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యాయని తీవ్రంగా విమర్శించారు. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం వంటి సమస్యలు ప్రజలను తీవ్రంగా వేధిస్తున్నాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే చేర్యాల మున్సిపాలిటీలో స్వచ్ఛమైన పాలన, ప్రజా సంక్షేమం, సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి వార్డులో అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించి, చేర్యాల పట్టణంలో కాంగ్రెస్ జెండాను గర్వంగా ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు, పట్టణ ప్రజలకు ఆయన గట్టి పిలుపునిచ్చారు.

