ముంబై,ఆగస్టు27(మనప్రజాప్రతినిధి): భారతీయ ఇతిహాసం ‘రామాయణం’ ఆధారంగా తెరకెక్కుతున్న భారీ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలో రావణుడి సోదరి శూర్పణఖ పాత్రలో నటి రకుల్ ప్రీత్ సింగ్ కనిపించనున్నారు. ఇప్పటివరకు శూర్పణఖ అంటే ప్రతినాయకురాలి పాత్రగానే చాలామందికి పరిచయం ఉన్నప్పటికీ, ఈ సినిమాలో ఆమె పాత్రను విభిన్న కోణాల్లో చూపించనున్నట్లు రకుల్ తెలిపారు.
శూర్పణఖలో ఎన్నో కోణాలు
శూర్పణఖ పాత్రలో తనను ఆకర్షించిన అంశాలు ఎన్నో ఉన్నాయని రకుల్ చెప్పారు. రావణుడి సోదరిగా మాత్రమే కాకుండా, లంకలో అత్యంత అందమైన మహిళల్లో ఒకరిగా శూర్పణఖను పేర్కొంటారని ఆమె గుర్తుచేశారు. ఆమెకు అహంకారం ఉన్నప్పటికీ, పాత్రలో అనేక భావోద్వేగాలు, విభిన్న కోణాలు ఉన్నాయని తెలిపారు. నటిగా ఇలాంటి సంక్లిష్టమైన పాత్రను ఆవిష్కరించడం తనకు ఆసక్తికరంగా అనిపించిందని చెప్పారు.
స్క్రిప్ట్తో కొత్త విషయాలు
సినిమా కథా రచన చదివే వరకు శూర్పణఖ జీవితం గురించి తనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయని రకుల్ వెల్లడించారు. లక్ష్మణుడు ఆమె ముక్కు కోసిన ఘటనకు ముందు, ఆ తర్వాత ఆమె జీవితంలో చోటుచేసుకున్న పరిణామాలను సినిమాలో కొత్త కోణంలో చూపిస్తున్నట్లు తెలిపారు. రాముడిని శూర్పణఖ ఎలా కలుస్తుంది? ఆ పరిచయం వెనుక ఉన్న అంశాలేమిటి? వంటి విషయాల్లోనూ తనకు కొత్త సమాచారం తెలిసిందని చెప్పారు.
భారీ తారాగణంతో ‘రామాయణ’
రణ్బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్, సన్నీ డియోల్, రవి దూబే తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. ఇతిహాస కథను ఆధునిక సాంకేతికతతో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి చిత్రబృందం ప్రయత్నిస్తోంది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. ‘రామాయణ: పార్ట్-1’2026 నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు రానుంది.



