సమగ్ర అభివృద్ధి – ఆఫ్రికా వేదికగా భారత సందేశం
సుస్థిర వృద్ధికి ‘ఇంటిగ్రల్ హ్యూమనిజం’ మార్గదర్శకం
జీ20లో ఆఫ్రికా ఆతిథ్యానికి భారత్ ప్రశంసలు
జోహాన్స్బర్గ్, 22 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత సమగ్రంగా, సంతులితంగా ఎదగాలంటే అభివృద్ధి ప్రమాణాలను మళ్లీ పరిశీలించాల్సిన అవసరాన్ని భారత ప్రధాని నరేంద్ర మోదీ జీ20 వేదికపై స్పష్టం చేశారు. దక్షిణాఫ్రికా జోహాన్స్బర్గ్లో జరుగుతున్న జీ20 శిఖరాగ్ర సదస్సులో తొలి సెషన్లో మాట్లాడిన ఆయన, “ఇది ఆఫ్రికా ఖండం తొలి జీ20 ఆతిథ్యం… ప్రపంచం కొత్తగా ఆలోచించాల్సిన సమయం ఇదే” అంటూ సభ్యదేశాలకు సందేశం ఇచ్చారు.
మోదీ పేర్కొన్న కీలకాంశాల్లో సమగ్ర వృద్ధి అవసరం ప్రధానంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అసమానతలు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఒత్తిడులు, వనరుల పంపిణీ లోపాలు ఇవి అన్ని కలిసి ప్రపంచ వృద్ధిని మందగింపజేస్తున్నాయని ఆయన గుర్తుచేశారు. ఈ నేపథ్యంలో, ఎదుగుదల ప్రతి ఒక్కరిని చేరేలా ఉండాలని, దేశాల మధ్య మాత్రమే కాదు, దేశాల లోపల కూడా సమానత్వం పెంపొందించాలని చెప్పారు. భారత నాగరికత విలువలను గుర్తుచేసిన మోదీ, ‘ఇంటిగ్రల్ హ్యూమనిజం’ (సమగ్ర మానవతావాదం) సిద్దాంతం ప్రపంచానికి సమతుల అభివృద్ధి దిశ చూపగలదని అన్నారు. మనిషి, సమాజం, ప్రకృతి ఇవి మూడు పరస్పర అనుసంధానంతో మాత్రమే సుస్థిర వృద్ధి సాధ్యమవుతుందని ఆయన వివరించారు. ఈ దృక్పథం పర్యావరణ సంరక్షణతో పాటు ఆర్థిక సౌభాగ్యాన్ని కూడా సమానంగా తీసుకుపోతుందని వ్యాఖ్యానించారు. ఆఫ్రికా దేశాల ఎదుగుదలకు భారత్ ఎప్పటిలాగే మద్దతుగా ఉంటుందని మోదీ హామీ ఇచ్చారు. వ్యవసాయం, ఆరోగ్యం, డిజిటల్ కనెక్టివిటీ, స్టార్టప్ పరిసరాలు, విద్య వంటి రంగాల్లో భారత్–ఆఫ్రికా భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని అన్నారు. “ఆఫ్రికా జీ20 కుటుంబంలో చేరడం ప్రపంచానికి కొత్త శక్తి, కొత్త దిశను ఇస్తుంది” అని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సంక్లిష్ట సవాళ్లు కొనసాగుతున్న వేళ, సహకారం, సంయుక్త చర్యలు, సాంకేతికతను పంచుకోవడం, పచ్చశక్తి వృద్ధికి ప్రోత్సాహం వంటి అంశాలు భవిష్యత్ వృద్ధి దిశను నిర్ణయిస్తాయని మోదీ స్పష్టం చేశారు. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాలకు సమాన అవకాశాలు కల్పించే విధంగా ఆర్థిక విధానాలు రూపుదిద్దుకోవాలని కోరారు. జీ20లో భారత్ ఇటీవల చేపట్టిన కార్యక్రమాలు డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మిలెట్ మిషన్, గ్రీన్ డెవలప్మెంట్ అజెండాఈసారి కూడా ప్రస్తావనకు వచ్చాయి. వీటి ద్వారా ప్రపంచానికి భారత్ అందిస్తున్న సహకారం, నూతన పరిష్కారాలు స్పష్టమవుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ సదస్సు ప్రపంచ భవిష్యత్ వృద్ధి మార్గాలను నిర్ణయించే కీలక వేదికగా మారుతోంది. ఆఫ్రికా ఆతిథ్యంతో సాగుతున్న ఈ జీ20 సదస్సు, అభివృద్ధి సూత్రాలకు కొత్త దృష్టికోణం జోడించనుంది.
జీ20 సదస్సు తొలి సెషన్లో మోదీ ప్రసంగం
RELATED ARTICLES

