“దేశభక్తి నినాదాలతో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ర్యాలీ
సిద్దిపేటనియోజకవర్గం//మనప్రజాప్రతినిధి:అగస్టు12
హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్), సిద్దిపేట ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా ర్యాలీ నిర్వహించారు. కళాశాల నుంచి సిద్దిపేట బస్టాండ్ వరకు విద్యార్థులు చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని దేశభక్తిని పెంపొందించే నినాదాలతో ర్యాలీ నిర్వహించారు.
విద్యార్థులు జాతీయ జెండాలను చేతబట్టి దేశభక్తిని చాటుతూ, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని ప్రజలకు అవగాహన కల్పించారు. “హర్ ఘర్ తిరంగా–ప్రతి ఇంటిపై జాతీయ జెండా”, “దేశభక్తిని చాటుదాం–జాతీయ జెండాను గౌరవిద్దాం”, “మాతరం మాతరం.. వందేమాతరం” వంటి నినాదాలతో ప్రజల్లో జాతీయ స్ఫూర్తిని నింపారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రమీల మాట్లాడుతూ, ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయడం ద్వారా దేశ సమైక్యత, జాతీయ స్ఫూర్తి, దేశభక్తి భావాలు మరింత బలోపేతం అవుతాయని అన్నారు. హర్ ఘర్ తిరంగా వంటి కార్యక్రమాలు విద్యార్థుల్లో దేశభక్తి, జాతీయ బాధ్యత, సామాజిక చైతన్యాన్ని పెంపొందించేందుకు ఎంతో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థులు ర్యాలీ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు.
ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ దరిపల్లి నగేష్ మాట్లాడుతూ, హర్ ఘర్ తిరంగా కార్యక్రమం జాతీయ జెండాపై గౌరవాన్ని పెంపొందించడంతో పాటు ప్రతి పౌరుడిలో దేశం పట్ల బాధ్యతా భావాన్ని పెంచుతుందని అన్నారు. విద్యార్థులు స్వయంగా ర్యాలీలో పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించడం ద్వారా దేశభక్తి సందేశాన్ని సమాజంలోకి తీసుకెళ్లారని తెలిపారు. ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను గౌరవిస్తూ హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో కళాశాల స్టాఫ్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, స్పోర్ట్స్ ఇన్చార్జి అశోక్, స్టూడెంట్ కౌన్సిలర్ ఫాతిమా, అధ్యాపకులు రఘురాజ్, రాజ్యలక్ష్మి, నరేందర్ రెడ్డి, శ్రీకాంత్, సత్యనారాయణ, విజయభాస్కర్, రవి, రాజశేఖర్, బేతి శ్రీనివాస్, పి. శ్రీకాంత్ తదితరులతో పాటు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


