– మూడు నెలల క్రితమే అమెరికా పయనం
– ఫ్లోరిడాలో ఘోర ప్రమాదం
– కుటుంబంలో విషాద ఛాయలు
– ప్రమాదంపై పోలీసుల దర్యాప్తు
నిజామాబాద్,ఆగస్టు26(మనప్రజాప్రతినిధి): అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఫ్లోరిడా రాష్ట్రంలో చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలానికి చెందిన రాహుల్ మృతి చెందినట్లు సమాచారం. ఉన్నత విద్య, మెరుగైన భవిష్యత్తు లక్ష్యంగా కేవలం మూడు నెలల క్రితమే అమెరికా వెళ్లిన రాహుల్ ఆకస్మికంగా ప్రాణాలు కోల్పోవడం స్వగ్రామంలో విషాదాన్ని నింపింది. రాహుల్ అమెరికాలో ఉద్యోగ, విద్యా అవకాశాల కోసం వెళ్లినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అక్కడ స్థిరపడేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం జరగడంతో అతని ఆశయాలు మధ్యలోనే ముగిశాయి. ప్రమాద వార్త తెలిసిన వెంటనే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఇంటి వద్ద విషాద వాతావరణం నెలకొంది.
ప్రమాదం జరిగిన సమయంలో రాహుల్ మరో ఇద్దరు యువకులతో కలిసి ప్రయాణిస్తున్నట్లు సమాచారం. అయితే ప్రమాదానికి దారితీసిన ఖచ్చితమైన కారణాలు ఇంకా వెల్లడికాలేదు. వాహనం అదుపు తప్పిందా, ఇతర వాహనంతో ఢీకొన్నదా అనే అంశాలపై అమెరికా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ ఘటనలో మరణించిన మిగిలిన ఇద్దరు యువకుల పూర్తి వివరాలు కూడా వెలువడాల్సి ఉంది. ప్రమాదం జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. అయితే గాయాలు తీవ్రంగా ఉండటంతో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.
రాహుల్ మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ప్రయత్నాలు ప్రారంభించారు. ఇందుకు అవసరమైన పత్రాలు, అధికారిక ప్రక్రియల కోసం భారత రాయబార కార్యాలయంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిసింది. మృతదేహం స్వదేశానికి చేరిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విదేశాల్లో మెరుగైన భవిష్యత్తు కోసం వెళ్లిన యువకుడు కొద్దికాలానికే దుర్మరణం పాలవడం నవీపేట్ ప్రాంత ప్రజలను కలచివేసింది. రాహుల్ కుటుంబానికి ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు అవసరమైన సహాయం అందించాలని స్థానికులు కోరుతున్నారు. కుటుంబ సభ్యుల రోదనలు గ్రామస్తులను కంటతడి పెట్టిస్తున్నాయి.
అమెరికాలో రోడ్డు ప్రమాదంలో తెలంగాణ యువకుడు మృతి
RELATED ARTICLES



