రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రమాణం
2027 ఫిబ్రవరి 9 వరకు పదవిలో కొనసాగనున్నారు
తొలిసారిగా అనేక దేశాల చీఫ్ జస్టిస్లు హాజరైన విశిష్ట కార్యక్రమం
న్యూఢిల్లీ, 24 నవంబర్ (మనప్రజాప్రతినిధి):
భారత కొత్త ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ సోమవారం రాష్ట్రపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో ప్రమాణస్వీకారం చేశారు. ఆదివారం పదవీ విరమణ చేసిన సీజేఐ బీఆర్జవాయ్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు. 2027 ఫిబ్రవరి 9వ తేదీ వరకు ఈ పదవిలో కొనసాగనున్నారు. హరియాణాకు చెందిన తొలి వ్యక్తిగా సీజేఐగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ సూర్యకాంత్ చరిత్ర సృష్టించారు. ఈ ప్రమాణస్వీకార కార్యక్రమానికి భూటాన్, కెన్యా, మలేసియా, మారిషస్, నేపాల్, శ్రీలంక దేశాల చీఫ్ జస్టిస్లు వారి కుటుంబ సభ్యులతో కలిసి హాజరుకావడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జస్టిస్ సూర్యకాంత్ 1962 ఫిబ్రవరి 10న హిసార్లో ఓ సాధారణ కుటుంబంలో జన్మించారు. 1984లో రోహ్తక్లోని మహర్షి దయానంద్ యూనివర్శిటీలో న్యాయశాస్త్ర పట్టా పొందారు. 2004 జనవరి 9న పంజాబ్–హర్యానా హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులై, 2018లో హిమాచల్ ప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్గా పదోన్నతి పొందారు. 2019 మే 24న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించబడ్డారు. దేశ చరిత్రలో కీలకమైన పలువురు తీర్పుల్లో ఆయన పాత్ర ఉంది. ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన చారిత్రక తీర్పులో భాగమయ్యారు. పెగాసస్ స్పైవేర్ కేసు, బిహార్ ఓటర్ల జాబితా రివిజన్ కేసుల్లోనూ జస్టిస్ సూర్యకాంత్ కీలకంగా పనిచేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సీజేఐ భారత న్యాయవ్యవస్థలో సంస్కరణలకు మరింత దోహదం చేస్తారని న్యాయవర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

