📄 ePaper
Saturday, August 29, 2026
Homeఎడిటోరియల్కొద్దిమందికే సంపద కోట్ల జనానికి కష్టాలు..?

కొద్దిమందికే సంపద కోట్ల జనానికి కష్టాలు..?

📰 Generate e-Paper Clip

– పెరుగుతున్న సంపద… తగ్గుతున్న సమానత్వం
– వృద్ధి గణాంకాలు, ఖాళీ అయ్యే కుటుంబ బడ్జెట్లు
– పాలసీలు ఎవరి కోసం? లాభాలు ఎవరికీ?

జనవరి 11 (మనప్రజాప్రతినిధి),గంజాయి శ్రీనివాస్:

దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధి దిశగా సాగుతోందన్న ప్రభుత్వ గణాంకాల మధ్య, సామాన్యుల జీవితాల్లో మాత్రం ఆ వృద్ధి ప్రతిబింబించకపోవడం ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఒక వైపు కొద్దిమంది వద్ద అపార సంపద కేంద్రీకృతమవుతుండగా, మరోవైపు కోట్లాది మంది జీవన అవసరాల కోసం రోజూ పోరాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. సంపద పంపిణీలో పెరుగుతున్న అసమానతలు సమాజంలో అసంతృప్తిని, ఆగ్రహాన్ని పెంచుతున్నాయి.
పెరుగుతున్న జీడీపీ, స్టాక్ మార్కెట్ రికార్డులు, కార్పొరేట్ లాభాల గురించి పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నా, అదే సమయంలో ఉద్యోగ భద్రత లేని పని, తక్కువ జీతాలు, పెరుగుతున్న ధరల భారం సామాన్యుడిని నలిపేస్తున్నాయి. ఆర్థిక వృద్ధి ప్రయోజనాలు పైస్థాయిల్లోనే ఆగిపోతున్నాయా? అనే ప్రశ్న బలంగా వినిపిస్తోంది. మధ్యతరగతి కుటుంబాలు ఖర్చులు తగ్గించుకోవాల్సిన పరిస్థితిలోకి వెళ్లిపోతుంటే, పేదవర్గాలు అప్పుల ఊబిలో చిక్కుకుంటున్నాయి.
పాలసీలు నిజంగా ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని రూపొందుతున్నాయా? లేక పెద్ద పెట్టుబడిదారుల ప్రయోజనాలకే పరిమితమవుతున్నాయా? అన్న సందేహాలు వెల్లువెత్తుతున్నాయి. పన్ను రాయితీలు, సబ్సిడీలు, విధాన నిర్ణయాలు ఎక్కువగా కార్పొరేట్ వర్గాలకు లాభపడుతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. రైతులు, కూలీలు, చిన్న ఉద్యోగులు మాత్రం అదే స్థాయిలో మద్దతు పొందలేకపోతున్నారన్న అభిప్రాయం బలపడుతోంది.
సంపద కొద్దిమందికే కేంద్రీకృతమయ్యే పరిస్థితి కొనసాగితే, అది కేవలం ఆర్థిక సమస్యగానే కాదు, సామాజిక సంక్షోభంగా మారే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు వినిపిస్తున్నాయి. సమాన అవకాశాలు, న్యాయమైన ఆదాయ పంపిణీ లేకుండా దేశ అభివృద్ధి సాధ్యమా? అన్న ప్రశ్నకు సమాధానం వెతకాల్సిన బాధ్యత పాలకులపై ఉంది. లెక్కలకే పరిమితమైన వృద్ధి కాకుండా, ప్రజల జీవితాల్లో మార్పు తీసుకొచ్చే అభివృద్ధి అవసరమన్న డిమాండ్ మరింత బలంగా వినిపిస్తోంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.