•నీరు–కరెంటు లేమితో ఇబ్బందులు పడుతున్న దివ్యాంగులు
•బోరు, కరెంటు మీటర్, మిషన్ భగీరథ కనెక్షన్ కోరుతూ వినతి
•మౌలిక వసతులు లేక సమావేశాలు, సేవా కార్యక్రమాలకు ఆటంకం.
•దివ్యాంగుల జేఏసీ భవనానికి తక్షణ సౌకర్యాలు కల్పించాలి
•మానవీయ దృక్పథంతో స్పందించిన ఎమ్మెల్యే హరీష్ రావు
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.జనవరి26
సిద్దిపేట పట్టణ కేంద్రంలో ఉన్న తెలంగాణ దివ్యాంగుల జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) భవనానికి తక్షణమే మౌలిక వసతులు కల్పించాలని కోరుతూ జేఏసీ నాయకులు స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, దివ్యాంగుల సమావేశాలు, సమస్యలపై చర్చలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ భవనం కీలక కేంద్రంగా ఉపయోగపడుతోందని తెలిపారు. అయితే ప్రాథమిక సౌకర్యాల కొరత వల్ల దివ్యాంగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా భవనానికి త్రాగునీటి సౌకర్యం లేకపోవడం వల్ల దివ్యాంగులు, మహిళలు, వృద్ధులు ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే బోరు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే కరెంటు మీటర్ కనెక్షన్ లేకపోవడం వల్ల సమావేశాలు, రికార్డు నిర్వహణ, సేవా కార్యక్రమాలు సక్రమంగా జరగడం లేదని వివరించారు.దీర్ఘకాలిక పరిష్కారంగా మిషన్ భగీరథ ద్వారా త్రాగునీటి నల్ల కలెక్షన్ (వాటర్ కనెక్షన్) ఏర్పాటు చేయాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మౌలిక వసతులు కల్పిస్తే దివ్యాంగులు ప్రభుత్వ సంక్షేమ పథకాలను మరింత సమర్థంగా పొందడంతో పాటు, తమ సమస్యలను సమిష్టిగా పరిష్కరించుకునే అవకాశం కలుగుతుందని తెలిపారు.దివ్యాంగుల సంక్షేమం పట్ల ఎల్లప్పుడూ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్న ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ఈ వినతిపై సానుకూలంగా స్పందించి, అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బొంగోని శ్రీశైలం బాబు, చిట్యాల సంపత్, పిడిశెట్టి నారాయణ, గంధ మల్ల జగన్, గడ్డం శ్రీనివాస్ రెడ్డి, బాలమణి విష్ణు, రాజు, రాజేశం, దండు మల్లేశం, సలీం, వేణు, సురేష్, కుచ్చులు అరుణ తదితరులు పాల్గొన్నారు.

