– కార్మికుల కోసం శర్మిల ఘాటైన విమర్శ
– ఉత్పత్తి తగ్గుదలకు ప్రభుత్వమే కారణమని ఆరోపణ
– కార్మికులపై నిందలు మోపడం సరికాదని శర్మిల మండిపాటు
– సర్క్యులర్ వెనక్కు తీసుకోవాలని, తొలగింపులు రద్దు చేయాలని డిమాండ్
విశాఖపట్నం, నవంబర్ 17 (మనప్రజాప్రతినిధి):
విశాఖ ఉక్కు ప్లాంట్ పరిస్థితిపై కాంగ్రెస్ నేత వైఎస్ శర్మిల తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా బలహీనపరుస్తోందని, ముడిసరుకులు తగ్గించడం నుంచి వర్కింగ్ క్యాపిటల్ నిలిపివేయడం వరకు అనేక నిర్ణయాలు కార్మికులను నష్టపరుస్తున్నాయని శర్మిల ఆరోపించారు. ప్లాంట్ను అమ్మే కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయని ఆమె పేర్కొన్నారు. 30 వేల మంది కార్మికులను 18 వేలకే కుదించారు. 45 రోజుల పాటు ఉండాల్సిన రా మెటీరియల్ కేవలం 5 రోజులకు సరిపడేలా మాత్రమే ఇస్తున్నారని ఆమె మండిపడ్డారు. రైల్వే వ్యాగన్లు ఇవ్వకపోవడం, ఐరన్ ఓర్ సరఫరా నిలువడం వల్ల నెలలో వారం రోజుల పాటు ఉత్పత్తి ఆగిపోతున్న పరిస్థితిని శర్మిల ప్రస్తావించారు. అయితే ఈ అన్ని ఇబ్బందుల మధ్య కూడా కార్మికులు రోజుకు 16 వేల టన్నులు, సంవత్సరానికి 5.8 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తున్నారని ఆమె ప్రశంసించారు. యాజమాన్యం చేసిన తప్పులను కార్మికులపై నెట్టడం అన్యాయమని శర్మిల పేర్కొన్నారు. సగం జీతంతో పనిచేస్తున్న కార్మికుల పట్ల అన్యాయం జరుగుతోందని, వారి వేతనాలను కోస్తామనే బెదిరింపులు అంగీకారయోగ్యం కాదని అన్నారు. 7.3 మిలియన్ టన్నుల సామర్థ్యం ఉన్న ప్లాంట్లో కేవలం 1.5 మిలియన్ టన్నుల ఉత్పత్తి తగ్గిపోవడానికి ప్రభుత్వ చర్యలే కారణమని ఆమె వెల్లడించారు. స్టీల్ ప్లాంట్కు కావాల్సిన రా మెటీరియల్ పూర్తి స్థాయిలో అందించాలని, తక్షణం జారీ చేసిన సర్క్యులర్ను వెనక్కు తీసుకోవాలని, తొలగించిన కార్మికులను తక్షణం విధుల్లోకి తీసుకోవాలని శర్మిల డిమాండ్ చేశారు. కార్మికుల పోరాటానికి కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తోందని స్పష్టం చేశారు.
కార్మికులపై సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరమని శర్మిల విమర్శించారు. ఆంధ్రుల హక్కును అవమానించేలా మాట్లాడటం సరికాదని, వెంటనే క్షమాపణ చెప్పాలని కోరారు. కార్మికులకు పెండింగ్ జీతాలు ఇప్పించాలంటే ప్రధాని మోడీతో పోరాడాలని, ప్లాంట్ను సైలు లో విలీనం చేయించి ఎన్నికల హామీలు నిలబెట్టాలని ఆమె డిమాండ్ చేశారు.
విశాఖ ఉక్కుపై కేంద్రం చర్యలు అన్యాయం
RELATED ARTICLES

