“అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దు – ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల,జూలై30:
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఇల్లంతకుంట ఎస్సై సిరిసిల్ల అశోక్ విజ్ఞప్తి చేశారు. అత్యవసర పనులు ఉంటే తప్ప ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.
వర్షాల కారణంగా ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు, చెరువులు, కాల్వలు, ప్రాజెక్టుల వద్దకు వెళ్లకుండా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని హెచ్చరించారు. ముఖ్యంగా పిల్లలు, యువకులు చెరువులు, కాల్వల వద్ద ఈత కొట్టడానికి లేదా సెల్ఫీలు దిగడానికి వెళ్లకుండా తల్లిదండ్రులు ప్రత్యేక పర్యవేక్షణ వహించాలని సూచించారు.
వర్షాల వల్ల రోడ్లు తడిగా ఉండటంతో వాహనాలు స్కిడ్ అయ్యే ప్రమాదం ఉందని, వాహనదారులు పరిమిత వేగంతో అప్రమత్తంగా ప్రయాణించాలని ఎస్సై సూచించారు. అలాగే విద్యుత్ స్తంభాలు, విద్యుత్ పరికరాలు, తెగిపడిన విద్యుత్ తీగలకు దూరంగా ఉండాలని తెలిపారు.
ఏదైనా విపత్కర పరిస్థితులు ఎదురైతే ప్రజలకు సహాయం అందించేందుకు పోలీసు అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే డయల్ 100 / 112కు లేదా స్థానిక పోలీసు అధికారులకు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
భారీ వర్షాల వేళ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
RELATED ARTICLES


